టీమిండియా శిబిరంలో చేరిన కోహ్లీ

  • నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య ఏకైక వార్మప్ మ్యాచ్
  • విరాట్ కోహ్లీ ఆడడం అనుమానమే
  • అమెరికా వర్సెస్ కెనడా మధ్య మ్యాచ్‌తో నేటి నుంచి మెగా టోర్నీ షురూ
టీ20 వరల్డ్ కప్-2024 నిమిత్తం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శుక్రవారం (మే 31న) న్యూయార్క్‌ వెళ్లి అక్కడ ఉన్న టీమిండియా శిబిరంలో చేరాడు. ఐదు రోజులు ఆలస్యంగా జట్టుతో కలిశాడు. దీంతో ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న   విరాట్.. నేడు (శనివారం) భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక వార్మప్ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగా మారింది. సుదీర్ఘ విమాన ప్రయాణం అనంతరం అతడు విశ్రాంతి తీసుకుంటున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా నేటి (శనివారం) నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 ఆరంభం కానుంది. ఆతిథ్య దేశం అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా ఈసారి పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 20 జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా మే 28న న్యూయార్క్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్‌ను ఆడనుంది.

వార్మప్ మ్యాచ్‌ ఆడేదెవరు?
బంగ్లాదేశ్‌తో శనివారం జరగనున్న వార్మప్ మ్యాచ్‌ కోసం భారత ఆటగాళ్లు శుక్రవారం ప్రాక్టీస్ చేశారు. రింకూ సింగ్, శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్ ఆప్షనల్ సెషన్‌లో కూడా పాల్గొన్నారు. దీంతో వార్మప్ మ్యాచ్ తుది జట్టులో ఎవరెవరు ఆడనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

జట్టులో కోహ్లీ పాత్రతో పాటు ఫస్ట్-ఛాయిస్ వికెట్ కీపర్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లలో ఎవరిని తీసుకోబోతున్నారనేది తెలుస్తుందని అంచనా వేస్తున్నారు. వీరిద్దరూ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించడంతో ఎవరికి చోటిస్తారనేది ఉత్కంఠగా మారింది.

Virat Kohli
T20 World Cup
T20 World Cup 2024
Cricket
Team India

More Telugu News